హైదరాబాద్ లోక్ సభ పరిధిలో పలువురు నేతలను కలుస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవీలత

  • ఎన్నికల్లో తనకు అండగా ఉండాలని కోరుతూ బీజేపీ సీనియర్లను కలుస్తోన్న మాధవీలత
  • మాధవీలతను కలిసిన చాదర్‌ఘాట్ కార్పోరేటర్, పలువురు నాయకులు
  • నిన్న ఆలె నరేంద్ర తనయుడు ఆలె జితేంద్రతో సమావేశమైన మాధవీలత
హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కొంపెల్ల మాధవీలత నియోజకవర్గంలోని పలువురు నేతలను కలుస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న తనకు అండగా నిలబడాలని, తన గెలుపుకు సహకరించాలని కోరుతూ నేతలను కలుస్తున్నారు. సైదాబాద్‌లో కార్పొరేటర్ కొత్తకాపు అరుణా రవీందర్ రెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్‌ సుభాష్ చందర్, భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్ రెడ్డి తదితరుల ఇళ్లకు వెళ్లి కలిశారు. ఆయా ప్రాంతాల్లో డివిజన్ ముఖ్య నేతలను పిలిపించి మాట్లాడారు.

చాదర్‌‌ఘాట్‌లో కార్పోరేటర్ భాగ్యలక్ష్మితో పాటు పలువురు బీజేపీ నాయకులు శుక్రవారం మాధవీలతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి, ప్రజలకు ఇస్తోన్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మాధవీలత విజయం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. ఎంపీ అభ్యర్థి మాధవీలత నిన్న టైగర్ ఆలె నరేంద్ర తనయుడు ఆలె జితేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి మద్దతు కోరారు. బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడు వి.పాండు యాదవ్‌ను కూడా కలిశారు.

Madhavi Latha
BJP
Telangana
Hyderabad

More Telugu News